30, మార్చి 2010, మంగళవారం

నేనెందుకిలా-------11

నేనువద్దనుకున్నా నాకు ఎదురైన అనుభవాలు ,నా జీ వితంలో సంభవించిన సంఘటనలు ,నా మనస్సును నలిపి నాశనం చే శాయి. రోజులు గడీచే కొద్దీ నేను పొడుగ్గా అయి పోసాగాను. నేనిప్పుడు మా క్లాసులో అందరికన్నా పొడుగు.
ఇప్పుడు గమనిస్తుంటే ,సిగ్గుగా ఉంది. అందరూ నావైపు వింతగా చూడసాగారు.నా గొంతులో మార్ధవం మాయమై కర్కశత్వం చోటు చేసుకొంది. నేనెం త జాగ్రత్తగా ఉన్నా నాహావభావాల్లో కొట్టొచ్చినట్టు  మార్పు కనిపిస్తూంది.
నిశ్చల కూడా నాకు సాధ్యమైనంత దూరం గా ఉండడం గమనించాను. ఆరోజు అందరూ గేమ్సు క్లాసుకెళ్ళారు. క్లాసురూములో నేనూ నిశ్చలా మాత్రమే మిగిలాము.నిశ్చల నాకోసమే ఆగినట్లుంది.నాతో ఏదో మాటాడాలను కొన్నట్టుంది.గేమ్సు క్లాసులో నేను గ్రౌండుకు పోవటం మానేసి చాలారోజులయ్యింది.ఎవ్వరూ నాతో ఆటలకు రావటంలేదు.ఒంటరిగా కూర్చోవాలి. అందుకే క్లాసులో కూర్చొని ఏదో పుస్తకం చదువుకొంటూంటాను.అన్ని ఆటలకూ ఒకప్పుడు నేనే లీడర్ని.నేను చెప్పేదే వేదం. ఇప్పుడు నాజీవితమెంత దయనీయంగా మారింది.స్నేహితులందరూ ఒక్కొక్కరేదూరమయ్యారు.ఈ జీవన ఝురిలో నేనొంటరినై,తోడులేక ,స్నేహితులు కరువై ఎంతకాలమిలా కొట్టుకు పోవాలి?
హటాత్తుగా నిశ్చల నావై పు దూ సుకు రాసాగింది.నేను ఖిన్నురాలినయ్యాను. భయంగా లేచి నిల్చున్నాను.నాకు చిన్నగా నవ్వువచ్చింది.నిశ్చలను చూసి నేను భయపడట మేమిటి? ఒకవేళ అది బిడియమేమో!
పరుగెత్తుకొచ్చిన నిశ్చల నాదగ్గరకువచ్చి నిలబడి పోయింది.నా చేతులుగట్టిగా పట్టుకొని భోరుమని ఏడవ సాగింది.దాన్ని అలా చూసి నాకుకూడా ఏడుపు ముంచుకొచ్చింది.నాకన్నులు చెరువులేఅయినాయి.దాన్ని కౌగలించుకొని
పెద్దగా ఏడ్చేశాను."బృందా! ఎందుకే ఇలాగయ్యింది?నువ్వెంత మం చిదానివి?భగవంతుడెంత నిర్ధయుడు.నీవు నా ప్రాణ స్నేహితు రాలివి. నీకో సం నేను చచ్చిపోవటానికి కూడా సిద్దంగా ఉన్నానే.నేను నీకేంచేయగలను?చెప్పు బృందా చెప్పు!" ఆ భావావేశంలో అది నా బుగ్గలపై ముద్దులు పెట్టుకో సాగింది.అంత దుఃఖం లో కూడా సంతోషంతో నామనసు నిండి పోయింది.నాకోసం కన్నీరు కార్చటానికి నాకొక ప్రాణ స్నేహితురాలుంది.అదిగూడా నేనత్యంతంగా ప్రేమించే నిశ్చల.నాజీవితం  సార్ధక మయ్యింది.నా నిశ్చల మామూలు గా అందరిలాంటి స్నేహితురాలుగాదు.నేనే దాన్ని అపార్ధంచేసుకొన్నాను.ఆకౌగిట్లో మాఇద్దరి తనువులొకటై,మనస్సులో మనస్సు లయించిపోతున్నసమయంలో
"బృందా!","నిశ్చ్లలా " అన్నకేక,మాఇద్దరినీ దిగ్గున విడదీసింది.ఎదురుగా మేడం, కొంతమంది మాక్లాసు అమ్మాయిలు నిల్చుని ఉన్నారు.మేము సిగ్గుతో తలలు దించుకున్నాము.
  "నిన్ను ఇన్ని రోజులు స్కూల్లో ఉంచటమే తప్పు." అంటూ ప్రిన్చిపల్ రూం వైపు దూసుకు పోయింది మేడం .ఆరోజే స్టాఫ్ మీటింగ్ జరిగింది.నాకు టిసి ఇవ్వటం ఖరారైపోయింది.మానాన్నను పిలిపించి టిసి ఇచ్చేశారు.
************************************************************************************************
                                                    "బృందా" పిలిచాడు శివా. వాడు  నాతో ఎక్కువగా మాటాడుతున్నాడిప్పుడు.వాడి పరిస్తితి వాడికి తెలియకుండా జాగ్రత్త పడ్డామందరం.ఇంకొక పదహైదు రోజుల తర్వాత ఆపరేషనుకు డేటిచ్చారు డాక్టర్లు.ఇంట్లోనేకూర్చొని చదువుకొంటున్నాను నేను.బయటకు వెళ్ళ్టటం దాదాపుగా మానేశాను.వీధిలో అందరూ నావై పు అదోలా చూస్తున్నారు.నా వెనుక నవ్వుకొంటున్నారనుకొంటాను.
"ఏమిటి శివా"  ఆరోజు ఆదివారం. ఇంతకు ముందు ఆదివారమొస్తే ఇల్లంతా సందడి సందడిగా ఉండేది. నేను స్నేహితురాళ్ళింటికి వెళ్ళటం, ఒక్కోసారి వారు ఇక్కడకు రావటం,మా ముగ్గిరి కొట్లాటలుతో ఇల్లంతా గోలగోలగా ఉండేది.
ఇప్పుడు ఆసంతోషమేది!.ఆసందడి ఎక్కడ?మునిగి పోతున్న నావలో ముక్కు మూసుకొని కూర్చున్న నావికులవలె ఎవరి ఆలోచనల్లో వాళ్ళు.అపరిచితులైన ప్రయాణీకులమల్లే రోజులు గడుపు తున్నాము.
  "నేనొక్క మాట  చెప్తే నీవేమనుకోవుగదా!" వీడెంత ఎదిగి పోయాడు .నాతోకూడా ఫార్మల్ గా మాటాడు తున్నాడు."చెప్పు శివా"
వాడు చెప్పినమాట విని నేను హతాశు రాలినయ్యాను.కళ్ళు కొద్దిగా తిరిగిన ట్లనిపించింది.మంచం గట్టిగా పట్టుకొని కూర్చున్నాను............

26, మార్చి 2010, శుక్రవారం

నేనెందుకిలా....10

ఆ రోజు నించీ నా జీవనగమనంలో విపరీతమైన మార్పు వచ్చింది. చైతన్య వంతమైన సమాజంలో ఉంటూనే మౌనినైపోయాను.శరీరంలోకలుగుతున్న వికారాలు నన్ను క్షణ క్షణం భాదించ సాగాయి. భగవంతుడా! నేనెలా జీవించాలనుకొన్నాను? నాజీవితం ఎందుకిలాగయ్యింది.?నేను  చేసిన పాపమేంటి?
నా ఈశరీరమేకాదు,మాకుటుంబమే తుఫానులో చిక్కుకొంది. నేను అత్యధికంగా ప్రేమించే వాళ్ళే నాకు దూరంకాసాగారు.
ఒకరోజు శివాకు జ్వరంవచ్చిందని డక్టరుదగ్గరకు తీసికెళ్ళాము. పరీక్షల్లో వాడికి బ్రైనులో ట్యూమరు ఉన్నట్టు బయట పడింది.
ఇంటిల్లపాదీ హతాసులమయ్యాము.అమ్మైతే చిక్కి శల్యమైపోయింది.మొన్నటి వరకూ ఆనందంగా ఉన్న మాకుటుంబంలో ఒక్క సారిగా ఎంత విషాదం?
సంతోషానికీ దుఃఖానికీ మధ్య రేఖ ఎంత స్వల్పమైనది!
నాన్నగారు వాడిని తీసికొని తిరగని ఆసుపత్రి లేదు. ఎక్కడికెళ్ళినా ఒకేమాట.ఆపరేషన్ చేయాలి.ప్రాణానికి గ్యారంటీలేదు.ఒకవేళ బ్రతికినా శరీరంలోని ఏభాగమైనా దెబ్బతినవచ్చు.
అమ్మ దుఃఖానికి అంతేలేకుండాపోయింది.
నావెనుకే కొచెందూరం పరుగెత్తి, ఆపై పరుగెత్తలేక రొప్పుతూ నిల్చునే శివా రూపమే నాకళ్ళముందు కన్పించేది.నాపై ఎంత ప్రేమగా ఉండేవాడని?
నాకన్నుల్లో నీరు చిమ్మింది. నాన్న శివాను తీసుకొని మద్రాసు ఆసుపత్రికెళ్ళారు. అక్కడ కూడా అదేమాట చెప్పటం తో ఆపరేషన్ ఖాయమై పోయింది.
అమ్మ నన్ను పట్టుకొని భోరున ఏడ్చింది. ఆధుఃఖానికి చెలియలికట్టేది? విలవిల్లాడే మనసుతో మౌనంగా రోదిస్తున్న నాన్నను ఓదార్చేదెవ్వరు?
ఆపరేషనుకు ఇంక వారమేఉంది. మా ఆర్ధిక పరిస్తితు లు నాకంతగా తెలియవు గానీ డబ్బుకేమీ ఇబ్బంది లేదనే అనుకొంటాను.
**********************************************************************
      స్నానం చేసి వచ్చి అద్దం ముందు నిల్చున్న నేను ఉలిక్కిపడ్డాను. అందం మీద అంతగా శ్రద్ద లేని నేను ఎక్కవగా అద్దం చూసుకోను.డాక్టరుదగ్గరకు వెళ్ళి వచ్చినప్పటి నుండీ తరచూ చూసుకొంటున్నాను.నా పై పెదవి మీద నల్లగా నూనూగు వెంట్రుకలు రావటం గమనించాను.క్రిందిపెదవి నల్లగా మొరటుగా తయారయ్యింది.ముఖంలో లాలిత్యం అదృశ్యమై కరకుదనం ప్రవేశించింది.ఈ మార్పులన్నీ ఎప్పటినుంచో చోటు చేసి కొంటున్నా నేను గమనించనే లేదు. నేనప్పుడు గమనించలేదుగానీ చాలా రోజులనించీ మా యింట్లో అందరూ  నన్ను వింతగా చూస్తున్నారు.నేను నిశ్చలా సింధూలతో మునుపటికంటే చనువుగా ఉండే దాన్ని. ఒక రోజు సింధూ నాతో చెప్పలేక చెప్పలేక చెప్పింది
" మా మమ్మీ నీ తో తిరగొద్దని చెప్పిందే! ప్లీజ్,నన్ను అపార్ధం చేసుకోకు."
నేను నిశ్చేష్టురాలినయ్యాను. ఈ అనుభవాలకు అర్ధాలు అప్పుడు నాకు స్ఫురించలేదు. ఇప్పుడు గుండె కోసుకు పోతూంది.
నిశ్చలతో నా కెదురైన అనుభవం నన్నింకా గుండె కోతకు గురి చేసింది.............

15, మార్చి 2010, సోమవారం

నేనెందుకిలా-------9


                   కొత్త పుస్తకాలు కొత్తక్లాసు రూము, అట్టలువేసుకోవటం అంతా బిజీ బిజీ గా గడచిపోయింది చాలా రోజులు.మా అందరిలో సింధుజ కొంచెం బొద్దుగా ఉంటుంది.దాని గుండెలు అప్పుడే బాగా ఎత్తుగా అయిపోయాయి. మాది కోఎడ్యుకేషన్ కాదు కాబట్టి సరిపోయింది.లేకపోతే మగపిల్లల కొంటె చూపులన్నీ దాని మీదనే ఉండేవి. ఆసంవత్సరం మధ్యలో అనుకొంటాను.సింధుజ పెద్దమనిషయ్యింది.వాళ్ళ ఇంట్లో వారు ఆ ఫంక్షన్ను చాలా గ్రాండు గా చేశారు.అప్పట్లో నాకా విషయాల మీద అంత అవగాహన లేదుగానీ ఇప్పుడనిపిస్తూంది,సింధుజ చాలా అదృష్ట వంతురాలని.అలా ఎందుకనుకొన్నానో నా జీవిత గాధ చదివిన తర్వాత మీకేఅర్ధమవుతుంది. కాలమనే చక్రానికి బాల్యం బాట అయితే సంతోషం కందెనలాంటిది.మూడు సంవత్సరాలు ఎలా గడిచిపోయాయో తెలియనేలేదు. ఈమూడు సంవత్సరాల్లో ముఖ్యమైన సంగతులు చాలానే జరిగాయి. నిశ్చలగూడా పెద్దమనిషయ్యింది.అది ఇప్పుడు చాలా అందంగా తయారయ్యింది.అందరు టెన్త్ క్లాసుకు వచ్చేశాము.దీపిక స్కూలు మానేసింది.
కాత్య నాన్నగారికిట్రాన్స్ఫరు వచ్చి వేరేవూరికి వెళ్ళిపోయారు.నిశ్చల తల్లి ని పిచ్చాసుపత్రిలో చేర్పించారు .ఇందుకు నిశ్చల పిన్ని గట్టిగా పట్టుబట్టిందట.పదవ తరగతి లోనే దానికి పెళ్ళిచేయాలని పట్టుబట్టిందట.ఆమె తమ్ముడు నిశ్చల కంటే పన్నెండేళ్ళు పెద్దవాడు.అతనికిచ్చిచేయాలని ఆమె పంతం.కానీ నిశ్చల గట్టిగానే ఎదురు తిరిగింది.
తల్లి విషయంలో మాత్రం నాన్న పిన్ని ఏకంకావటంతో ఏమీ చేయలేక పోయింది. నన్ను అమ్మ ఒకసారి లేడీడాక్టరు దగ్గరకు తీసికొని వెళ్ళింది.వాళ్ళు చేసేపరీక్షలన్నీ చూసి నాకు చచ్చేసిగ్గేసింది."నా ఆరోగ్యం బాగానే ఉందిగదా !ఇప్పుడెందుకివన్నీ?" అన్నాను.అమ్మ నావైపు  మౌనంగా చూసింది.డాక్టరు అమ్మకేదో చాలా సేపు చెప్పింది.
బయటకు వచ్చిన అమ్మ నన్ను కౌగలించుకొని కన్నీరు పెట్టుకొంది.ఎందుకలా ఏడ్చిందో నాకిప్పుడర్ధమయ్యిందిగానీ అప్పుడు తెలీలేదు.ఆసుపత్రి నుంచీ వస్తుంటే దూరంగా
మబ్బులు గుంపులు గుంపులుగా తూర్పు వైపునుంచీ పరుగెత్తుకొచ్చి మధ్యలో కమ్ముకోవటం ప్రారంభించాయి. గాలి చల్లగా ప్రారంభమయ్యి ,పెను తుఫానుగా మారసాగింది.మేము ఆటోలో ఇల్లు చేరుకొనేసరికి వాన కూడా మొదలయ్యింది.ఈ ఫోడుగాలిలో క్షణ క్షణాని కీ ఉద్రుతమౌతున్న వర్షంలో ,లోపల అమ్మ నాన్నతో ఏదో ఏడుస్తూ చెప్తూంది.కొన్నిమాటాలు నా చెవినగూడా పడ్డాయి. ఇప్పుడు నేనేమంత మరీ చిన్నదాన్ని కాదుగదా!ఆమాటలు నాకర్ధమయ్యేసరికి మెరుపులతో ఆకాశం  తగలబడుతున్నట్లు గా ఉంది. వరుసగా వందపిడుగులు  మా ఇంటి చుట్టూ పడ్డంత చప్పుడు. ఉన్నట్లుండి నాకు కళ్ళు తిరగసాగాయి.వరండాలో నాముందున్న కుర్చీని పట్టుకొని అలాగే కూలిపోయాను...........

2, మార్చి 2010, మంగళవారం

నేనెందుకిలా-------8

      

            నా గుండెల మీద ఏదో బరువుగా తగిలింది.ఎవరో స్టెతస్కోపు ఆన్చినట్టున్నారు.డాక్టరు కాబోలు. ఇంకా నేను బ్రతికే ఉన్నానో లేదో తేల్చటానికై ఉంటుంది.
        అతి కష్టంమీద కదలటానికి ప్రయత్నిస్తున్నాను.ఆశ్చ్ర్యకరంగా నాదేహంనాకు సహకరించటం లేదు.ఎంత ప్రయత్నించినా కొంచెంగూడా కదలలేక పోతున్నాను.
      అంటే నేను విగత జీవినౌతున్నానా? నాలో చైతన్యం మరణించిందా? కళ్ళు తెరవటానికినేను చేస్తున్న ప్రయత్నం వ్య్రర్ధమౌతూంది.కనుల సాయం లేకుండా చూడలేక పోతున్నాను. నోరుసాయంలేకుండా ఏమీ మాటాడ లేకపోతున్నాను.మరణమంటే ఇలాగుంటుందా?అయ్యో! మృత్యువు నన్ను కబళించేసి నట్టేఉంది.బయట అందరూ డాక్టరు పెదవి విరుపు కోసం ఎదురు చూస్తూంటారా? ఏమౌతూంది?  ప్రాణం పోవటం అంటే ఎలాఉటుంది-అన్న ఉత్కంఠ ప్రతి ఒక్కజీవికీ ఉంటుంది.ప్రాణంపోయిన తర్వాత ఏమౌతుంది-అన్నప్రశ్నకు ఒక్కొక్కరు రకరకాల సమాధానాలు చెప్పారు.కానీ ఆ అద్భుతమైన అనుభవాన్నినేను స్వయంగా అనుభవించ బో తున్నానా? ఇప్పుడు నాపరిస్తితి నేనెవ్వరికైనా చెప్పగలనా?  ఆ అవకాశమే కన్పించటంలేదు.నా సర్వేంద్రియాలూ స్పృహను కోల్పోయాయి.శరీరంలోఏభాగమూ పని చెయ్యటంలేదు.మనసొక్కటే ఆలోచించగల్గుతూంది.అంతా అంధకారం.ఏమీకన్పించటం లేదు.సినిమాలలో చూపినట్టు ఇక్కడంతా ఏంజరుగుతూందో పైనుండీ చూడ లేక పోతున్నాను.చిమ్మచీకటి. కొంచెంగా చెవులు మటుకూ విన్పిస్తున్నాయి.అవికూడాఏక్షణాన్నయినా మూసుకొని పోవచ్చు.నాశరీరం స్పర్శను పూర్తిగా కోల్పోయినట్లేఉంది.ఈచిమ్మ చీకటిలో, ఈదుర్భర నిశ్శబ్ధంలో నేనెక్కడికి వెళ్తున్నాను.
                                        ఒక్కసారిగా డప్పులమోత ఆకాశాన్నంటింది.లీలగా ఏడుపుల మోత విన్పిస్తూంది. అంటే డాక్టరు పెదవి విరిచాడా?నేను మరణించానా? క్రమంగా ఈ ఆలోచించే మనసు కూడా మరణిస్తుందా? అలాగేఉంది.ఇప్పుడేమీ విన్పించటంకూడాలేదు.శరీరంతోనాకున్న బంధం పూర్తిగా తెగిపోయింది.ఈశరీరం నన్నెంత ఏడిపించిందని? నా బ్రతుకును నాశనంచేసిందిఈ శరీరమేగదా?నన్ను నలుగురిలో నగుబాట్లు చేసింది ఈశరీరమే గదా?ఈ దేహం జీవితకాలంలో నన్ను కాల్చుకు తినింది.ఎన్ని నొప్పులు,ఎన్ని రుగ్మతలు?ఎన్ని భాదలు?  కానీ ఈ శరీరం కొంత మంచిగూడా చేసింది.నాహావ భావాలను వ్యక్తీకరించగలిగాను.కానీ ఇప్పుడు?  నిశీధిలో కొట్టుమిట్టాడుతున్నాను.నేనెలాగున్నానో నేను చూసుకోలేను.వేరెవ్వరికీకన్పించను.పంచేంద్రియాలు పనిచేయటం మానేసి చాలా సేపయ్యింది. మనసు మటుకు ఆలోచించగల్గుతూంది.అదిగూడాఇంకెంత సేపు? ఇప్పుడు నన్ను
వేధిస్తున్న ప్రశ్న!మనసు,ఆత్మ ఒకటేనా? యుగపురుషులూ యోగసాధకులూ చెప్పిన ఆత్మ ఈ మనసేనా? మరి దీనికి చావులేదని చెప్పారే? ఇది క్రమక్రమంగా అస్తిత్వాన్ని కోల్పోతూంది. నా ఆలోచనల్లో వేగం తగ్గింది.
అంటే ఈమనసు ప్రకృతిలో లయించి పోతూందా !నిర్వీర్యమౌతున్న ఈ మనసుతో మళ్ళీ మెల్లగా ఆలోచనల్లో పడ్డాను.

*************************                                ********************                              **************                 

     వేసవి సెలవులిచ్చారు.అందరం పరీక్షలు బాగానేరాశాము. చివరి రోజు అందరం కల్సుకొని వీద్కోలు తీసికొన్నాము.సెలవుల్లో అప్పుడప్పుడూ కలవాలనుకొన్నాము.కానీ కుదరనే లేదు.మేము సెలవులుగడపటానికి మానానమ్మ గారి వూరెళ్ళాము.మానాన్న చిన్న తనమంతా అక్కడే గడిచింది.ఆవిషయాలన్నీ కధలు కధలుగా చెప్పేవాడు నాన్న.ఆఊరు చూస్తూంటే నాన్న చాలా అదృష్ట వంతుడనిపించింది.అంత చక్కని వాతావరణంలో పెరిగాడు కాబెట్టే నాన్న అంత ఆరోగ్యంగా కూల్ గా ఉంటారేమో.పచ్చటి పొలాల్లో తిరుగుతుంటే  హాయిగొల్పుతూ వీచే చల్లగాలులకు ఒళ్ళంతా పులకించేది..ఒక సంవత్సరానికి చాలా శక్తి వచ్చినట్లన్పించింది ఆఊర్లో.చూస్తూండగానే సెలవులయిపోయాయి.రిజల్టులు వచ్చాయనీ బయలుదేరి రమ్మనీ ఉత్తరం రాశాడు నాన్న. ఇక తప్పదన్నట్లు బయలుదేరాం అందరం.
                                         నేనూ ,మాఫ్రెండ్సందరం పాసయ్యాం.శివాకూడా పాసయ్యాడు.మధూ మటుకూ కొంచెం మొండికేసింది.నాన్న గారు వెళ్ళి క్లాసుటీచరు దగ్గర వచ్చేసంవత్సరం బాగా చదివిస్తానని హామీ ఇచ్చి పాసు చేయించుకొచ్చాడు.

నా కవితలు

  • నీవన్నది,నిజమైనది
  • నీ వున్నావని

నా బ్లాగు లిస్ట్‌

  • - ఎవరో నా ముక్కు దగ్గర వేలు పెట్టి చూశారు."ఇంకా ఊపిరి ఉంది" అని చెప్తున్నారు. వీళ్ళంతానా చావు కోసం ఎదురు చూస్తున్నారు.నన్ను త్వరగా రధం మీదకు ఎక్కించాలి. ఎవరో ...
    14 సంవత్సరాల క్రితం

నా గురించి

CHENNAI, TAMILNADU, India
జీవితంలో కష్టసుఖాల బరువు తెలుసు. ప్రేమానురాగాల మాధుర్యం తెలుసు. స్నేహవీచికలపులకింతలు అనుభవైకవేద్యం ఇక తెలియవలసిందెల్లా ఒకటే నా బ్లాగు మిత్రుల మనసు!