30, మార్చి 2009, సోమవారం

చైల్డ్ లేబర్

పసిపిల్లలను పనికిపంపి డబ్బు సంపాదించకూడదంటే మంచిదే అనుకొన్నాను. అందుకొక చట్టం తెస్తే ఇంకా సంతోషించాను.పిల్లలను పనిలో పెట్టుకొనేవాళ్ళను శిక్షిస్తామని ప్రభుత్వం హెచ్చరిస్తే , పర్లేదు మనదేశంలో కూడా కొంచెం మంచి జరుగుతోందని త్రుప్తి పడ్డా ను. ఇంకా చిన్నపిల్లలపై సెక్సువల్ హరాస్మెంటులు , రేపులు చేసేకిరాతకులుపై ప్రభుత్వం ఉక్కు పాదం మోపుతుంటే భారత దేశంలో చాలా మంచి జరుగుతోందని నాహృదయం ఆనందంతో ఎగిరి గంతేసింది.
కానీ ఎంతసేపు?
రాత్రి టీవీలో ఫలానా చానల్ చూస్తూకూర్చున్నాను.ఒకప్రోగ్రాము చూస్తున్న నేను నిశ్చేష్టుడినైపోయాను. నా నోట్లో తడారిపోయింది.ఒళ్ళంతా చెమటలుపట్టేసింది.జూనియర్స్ డాన్సు ప్రోగ్రామట.ఒక ఎనిమిదేళ్ళపాప డ్రాయరు బనీను వేసుకొని "అప్పటికింకా నావయసు నిండా పదహారే...." అన్న రికార్డుకు గెంతులేస్తూంది.
అంతచిన్నపిల్ల వయసుకు మించిన హావభావాలు చూపిస్తూంది.ఎలాగైనా ప్రైజు తెచ్చుకోవాలన్న కసి ఆ పాప ముఖంలో కనిపిస్తూంది. ముగ్గురు జడ్జీలు భలేచేశావనిఆపాపను పొగడ్తలతో ముంచేస్తున్నారు.జడ్జిమెంటు ఇవ్వడానికి వీరికి వున్న అర్హతలేమిటి? నిన్నటివరకు అర్ధనగ్నంగా సినిమాల్లో గెంతులేసినవారు ఈరోజు న్యాయనిర్నేతలా ?
నా మనసును తొలుస్తున్న ప్రశ్న " పసిపిల్లలు పనిచేయగూడదు గాని అర గొర బట్టలేసుకొని రికార్డు డాన్సులు చెయ్యవచ్చా?"ఈపోటీకి జడ్జీలా ? బాగాఎగిరినవాళ్ళకు ప్రైజులా? ఈప్రోగ్రాము కోసంఎంతమంది పిల్లలు భవిష్యత్తులు నాశనమౌతున్నయి?చదువులు మంట కలుస్తున్నాయి?భారతమాతా! నీపిల్లలను నువ్వే రక్షించుకోవాలమ్మా!
కనులు మూసుకొని ఆలోచిస్తున్నాను నేను...........

28, మార్చి 2009, శనివారం

నందోరాజాభవిష్యతి

ఒక రాజ్యాన్ని ఉత్తుంగభుజ మహారాజు పరిపాలిస్తు ఉండేవాడు.అతనికి రాణీ మీద అవ్యాజమైన ప్రేమ. వారికి నందుడు అనే కుమారుడు ఉండేవాడు.ఆదేశానికి ప్రతి సంవత్సరము ఒక నగల వ్యాపారి వచ్చేవాడు.వచ్చిన వెంటనే రాణీ నివాసానికి వెళ్ళి ఆమెకు నగలు విక్రయించేవాడు.రాణీ బోణీ మంచిదని అతని అభిప్రాయం.రాణీ మీద ప్రేమతో, రాజు, రాణీ ఎన్ని నగలు కొన్నా ఏమీ అనేవాడు కాదు.
ఇలా కొన్ని సంవత్సరాలు జరిగిపోయింది. రాజు ఒక నాట్యగత్తె వలలోపడతాడు. క్రమంగా రాణీ ని దూరంగా ఉంచుతూ వేశ్యను దగ్గరికి చేర్చుకొంటాడు. రాణీకి, ఊరికి దూరంగా భవంతి కట్టి అక్కడ ఉంచు తాడు.నందుడు తో ఆమె అక్కడ ఉంటూ ఉంటుంది.
ఆసంవత్సరం నగలవర్తకుడు మళ్ళీ వస్తాడు.రాణీ విషయం తెల్సుకొని చాలా చింతిస్తాడు.రాణీవాసానికి వెళ్ళి నగలు కొనమని అడుగుతాడు.అందుకు రాణీ "అన్నా! నేనిప్పుడు నిర్భ్హాగ్యురాలను.భర్తను దూరంచేసుకొని గంపెడు ధుఖముతో బ్రతుకును ఈడ్చుచున్నాను.ఇప్పుడు నాకు పూర్వపు వైభవము లేదు.ఐశ్వర్యము లేదు.నీవద్ద నగలను కొన్ననూ డబ్బు ఇవ్వగల స్టోమత లేదు.కనుక అన్నా నేను నీ వద్ద నగలను కొనలేను." అందుకు వ్యాపారి " తల్లీ! నా కు డబ్బు ముఖ్యము కాదు.మీ పరిస్తితులకు నేను చాలా బాధ పడు తున్నాను.నాకిప్పుడు డబ్బులివ్వనవసరం లేదు.అప్పుగా ఇస్తాను. మీరుతర్వాత ఇవ్వవచ్చు.మీరు నా వద్ద నగలు కొంటే నాకంతేచాలు" కానీ నగలు కొనటానికి రాణీ ఒప్పుకోదు."మీ అప్పు తీర్చే అవకాశం కనుచూపుమేరలో కన్పించడంలేదు.అందుకని తీసుకోలేను." అంటుంది.
అప్పుడు రాణీ గారి దాసి ఆమెను పక్కకు పిలిచి ఇలా చెబుతుంది
" ఉత్తుంగభుజ నాశోవా
దేశ కాల గతోపివా
వేశ్యా,వణిగ్వినాశోవా
నందోరాజా భవిష్యతి!"
"ఉత్తుంగభుజ మహారాజు చనిపోవచ్చు.దేశకాలపరిస్థితులు మారిపోవచ్చు.వేశ్యగాని,ఈవర్తకుడు గాని చనిపోవచ్చు.భవిష్యత్తులోమన నందుడే రాజుకావచ్చు.వీటిలో ఏఒక్కటి జరిగినా ఈఅప్పు తీర్చటం మీకు సమశ్య కాదు. కాబట్టి వ్యాపారి మాటవిని నగలు అప్పు తీసుకోండి" కధ నుంచి వచ్చిన సామెతేనందోరాజాభవిష్యతిఅన్నది.

17, మార్చి 2009, మంగళవారం

మనసు


మనసెందుకీ రోజు మసకబారింది
మలిరేయి గడిచినా నిదురరాకుంది!
పిసినారి దేముడు పిడికిటితో కొలిచి
చిల్లడ్డ మనసుని నాకిచ్చినాడు.
!

మమతాను రాగాలు మంచినీళ్ళుగా మార్చి

మనసంతానింపేసి మాయమైపోయాడు!

చిల్లున్న మనసులో చన్నీరునిలుచునా

కన్నీరుగామారి గుండెంత తడిపింది. !

అరవైలొ నా మనసు ఖాళీగ అయ్యింది

ఒట్టిపోయినమనసు గట్టిగా మారింది!

మనసెందుకీరోజు మసకబారింది
మలిరేయి గడిచినా నిదురరాకుంది!

16, మార్చి 2009, సోమవారం

రామవంశం


శ్రీ రామచంద్రుడు అయోధ్యకు తిరిగి వచ్చాడు .రావణుడిని సంహరించి సీతను తీసుకు వచ్చాడు.ఇప్పుడు అతనికి ఒక కోరిక పుడుతుంది.వసిష్టుడితో ఆ కోరిక చెబుతాడు.'నేను ఇంత కష్టపడి రావణుడిని సంహరించాను కదా !సీతను అగ్ని ప్రవేశం
చేయించి మరీ తెచ్చుకొన్నాను కదా ,మా వంశానికి ఇంకా రఘు వంశమనే పేరు
ఎందుకు? రామ వంశము అని వచ్చుగదా "
వశిష్టుడు చిరునవ్వు నవ్వి "అలాగే చెయ్యవచ్చు .కాని దానికి ముందు రఘు మహారాజు జీవితం లో జరిగిన ఒక సంఘటన చెపుతాను విను అని ఇలా చెప్పసాగాడు .
రఘుమహారాజు ఒకసారి భార్యతో కలిసి వేటకు పోతాడు.చాలాసేపు వేటాడిన తర్వాత ఇద్దరూ బాగా అలిసి పోతారు.మిట్టమధ్యాన్నం సమయం. సైనికులు యెవ్వరూ లేరు.తెచ్చుకున్న నీళ్ళు అయిపోయాయి.రాణికి దాహం వేస్తూంది. యెక్కడైనా నీళ్ళు కనిపిస్తాయేమోనని వెదుకుతూ బయలుదేరారు.కొంచెం దూరంలో ఒక పర్ణశాల క్యనిపినిచింది. అది ఒక గురుకులం. గురువు శిష్యులకు భోదిస్తున్నాడు.ఇద్దరూ వెళ్ళి తమను పరిచయం చేసుకొని దాహంగాఉందని చెబుతారు.గురువు వారికి మర్యాదలు చేసి ఆహారానికూడా ఇచ్చి సగౌరవం గా పంపుతాడు.
కొద్దిరోజులు గడుస్తుంది.తనసిష్యుల్లో ఒకడు తేడాగా ఉండడం గమనిస్తాడు గురువు.అతడు బాగా చిక్కి పోతాడు. చదువు మీద ఏకాగ్రత పోతుంది. అన్య మనస్కంగా కనిపిస్తాడు. గురువు అతడిని కారణం అడుగుతాడు. శిష్యుడు చెప్పడానికి సందేహిస్తాడు. అడగ్గా అడగ్గా శీష్యుడు చెప్పిన విషయం విని నివ్వెర పోతాడు గురువు.
గురుకులంలో రాణిని చూసిన శిష్యుడు ఆమెపై మనసు పారేసుకున్నాడు .ఎలాగైనా కనీసం ఒక రోజైనా ఆమెతో గడపాలని
లేకుంటే తాను ప్రాణాలతో ఉండనని చెప్తాడు .నయాన భయానా గురువెంతచెప్పినా శిష్యుడు వినడు.
వేరు దారి లేక గురువు బయలుదేరి రాజు వద్దకు వెళ్తాడు.విషయం తెల్సుకున్న రాజు చిన్నగానవ్వి "స్వామీ!ఇది పూర్తిగా
రాణి గారి సమస్య! నాకెందుకు చేఫున్నారో అర్ధం కావటం లేదు.మీరు ఈ విషయం ఆమెకే సెలవివ్వండి"అని చెప్తాడు.
గురువు రాణి గారి దగ్గరకు వెళ్లి విషయం చెప్పి క్షమించమని అడుగుతాడు. రాణి మ్లానత వదనయై కొంత సేపు కూర్చుం టుంది.చివరకు తలెత్తి "స్వామీ!మీ శిష్యుని ఈరోజు రాత్రికే రాణివాసానికి పంపండి.నేను సిద్ధంగా ఉంటాను"అంటుంది.
నిర్ఘాంతపోయిన గురువు శిష్యుడికి విషయం చెప్తాడు.
సంతోషంతో వచ్చిన శిష్యుడు రాణిని చూసి తెల్లమొగమేస్తాడు.
రాణినిండుగా చీర కట్టుకొని పెద్ద బొట్టు పెట్టుకొని చిరు నవ్వుతో అమ్మవారిలా కనిపిస్తుంది .శిష్యుడు ఆమె కాళ్ళపై
పడిసాష్టాంగ ప్రమాణం చేస్తాడు. తన తప్పును క్షమిం చమని వేడుకొంటాడు.అతన్ని లేవదీసి జుట్టు నిమిరి రాణి ఇలా
చెప్తుంది."కుమారా! ఇందులో నీతప్పేమి లేదు.బహుశా గురుకులానికి నేను వచ్చినప్పుడు నా వస్త్ర ధారణా
హావ భావాల్లో ఏదైనా పొరబాటు దొర్లి నీకలాంటి వికారం కల్గి ఉండొచ్చు.అందుకు నేనే క్షంతవ్యురాలిని."అని చెప్పి
పంపి వేస్తుంది.
వసిష్టుడు ఈ సంఘటన చెప్పి " ఇప్పుడు చెప్పు రామా! సీతను రక్షిం చుకోవటానికి నీవు ఎంతమంది సహాయం
తీసుకొన్నావు? ఎన్నిరోజులు గడిపావు? రఘుమహా రాజెక్కడ ? నీవెక్కడ ? మీది రఘు వంశమా ,రామవంశామా?
నీవే తేల్చుకో!" రాముడు అతనికి నమస్కరించి తలవం చుకుంటాడు.

14, మార్చి 2009, శనివారం

అమ్మ

నిన్ను పెంచి పెద్దచేసి,
అన్నాన్ని
గోరుముద్దలుగా చేసి,
నువ్వొద్దంటున్నా ముద్దుచెసి
నీచేత తినిపించిందీ అమ్మ!


అడుగులు పడక నువ్వుతడ పడుతుంటే
చేయిపట్టి నిన్ను నడిపించి
అడుగడుగుకూ పండుగచేసిందీ అమ్మ!


తన రక్తాన్ని పాలుగా మార్చి
నువ్వానందంగా త్రాగుతుంటే
పరవశంతో పొంగిపోతూ ,
అనారోగ్యంతో క్రుంగిపోతూ,
నిన్నింతటివాడిని చేసిందీ అమ్మ!

తన సంతోషాన్ని మూటలుగట్టి
నగలను తాకట్టుపెట్టి

నీచదువుకు పెట్టుబడి పెట్టి

నిన్ను చదివించిందీ అమ్మ!

తోడు పోయి ,నీడలేక

నీదేశంలో ఇమడలేక

మాటలతో పొడుస్తున్న
కోడలుతో ఉండలెక
ఒంటరిగానే ఉంటోందీ అమ్మ!

నువ్వు వస్తావని,పలకరిస్తావని ,

కాకుంటే ఫోనైనా చేస్తావని ,

మోగని ఫోనుప్రక్కన ,

ఇంకా ఆగని గుండెలలో
ఆశలు నింపుకొంటూ ,
కన్నీటి తెరల మధ్య
నీ కోసం వాకిలి కేసి చూస్తూ
కూర్చుని ఉన్నది ఈ అమ్మ!

9, మార్చి 2009, సోమవారం

నీ వన్నది నిజమైనది

చెలీ ,నీవన్నది నిజమైనది !
గుండెల నిండా ప్రేమను నింపుకొని
నిండుగా కల్సి వుండే నెచ్చెలులు
కాల గర్భంలో కలిసిపోతారని
జ్ఞాపకాల పొరలలో మిగిలి పోతారని
ఆనాడు నీవన్నది
ఈనాడు నిజమైనది!
చెలీ ,నీవన్నది నిజమైనది!

రక్త సంబంధాలు,మైత్రీబంధాలు
వ్యర్ధ పదాలని ,విలువ లేనివని
అర్ధ న్యాయానికి అవి కట్టు బడేవని
ఏనాడో నీవన్నది
చెలీ! ఈనాడు నిజమైనది !

అన్నదమ్ములు,తండ్రీకొడుకులు
అక్కా చెల్లెళ్ళు ,తల్లీకూతుళ్ళు
విడ దీయలేని బంధాలని
విలువకట్టలేని సంబంధాలని
ఆవేశంతో అంచనాలు వేస్తున్న నన్ను
చిరునవ్వుతో వారించి ,
కాటుక కన్నులను కదిలించి,
నా చెంపలపై నిమిరి,
జుట్టుపై తడిమి,
నింపాదిగా నీవన్నది
చెలీ,ఈనాడు నిజమైనది !

వ్రుదాప్యంలో ,వ్యక్తి సంబంధాలను
మనుమలు,మనుమరాళ్ళకు
మంచిగా బోధిస్తున్న నన్నుచూసి
కోపంతో విసుక్కోంటూ
ఆవేశంతో ఊగిపోతూ
కన్నకొడుకు కాలుతో తన్నినప్పుడు
పగిలిన అద్దాల పెంకులతో బాటు
విరిగిన హృదయపు శిధిలాలను
కన్నీటితో వొంగి ఏరుకొంటున్న
నావైపు ఎగతాళిగా చూడకు చెలీ
నిజమే! ఆనాడు నీవన్నది
ఈనాడు నిజమైనది!

సాయం సంధ్యా వెలుగులలో
నీ జ్ఞాపకాల పలుకులను, పిచ్చివాడిలా
తోటలో తిరిగి ఏరుకొంటున్న నాకు
జ్ఞప్తికోస్తున్నాయి నీవాడిన పలుకులు
నా జీవిత సంధ్యా కాలంలో
నేను వొంటరి నౌతానని
తోడు ఎవ్వరూ వుండరని ,నీవన్నది,
చెలీ,ఈనాడు నిజమైనది!

మరణ శయ్యపై నీవున్నప్పుడు
మృత్యువు కౌగిలిలో వొదిగి పోతూ
నా చెవిలో చెప్పిన వేద మంత్రం
మనుగడలన్ని అశాశ్వత మని
ముందూ వెనుకలు తప్పవని
నీవన్నది నిజమే చెలీ!

ఈనాడు మరణ శయ్యపై
మృత్యువు నాకై పొంచియుండగా
చూపు పోయిన నాకు ధిక్సూచివినీవై
నాప్రక్కన ఎవరున్నారో చెప్పాలని
తహతహ లాడే నీ హృదయ ఘోషను
వినడానికి ,ఇదిగో వస్తున్నా
చెలీ,నీవెనుకేవస్తున్నా ............!!

4, మార్చి 2009, బుధవారం

నీవున్నావని ..............

ఆకాశంలో నీవున్నావని
నెలవంకను దివిటీగా చేసుకుని
మబ్బుల మాటున,చుక్కల చాటున
రే యంతా వెదికాను !

నన్ను చూసి నవ్వుతూ
పైకి వస్తున్న సుర్యుడిని
పిచ్చివాడిలా ప్రశ్నించాను
నా చెలి యెక్కడని?

వెల వెల బోయిన నెలవంకను
పడమటి దిక్కుకు విసిరెసి
వడి వడి గా నడచి వచ్చాను
భూమ్మీద నీవున్నావని!

నిశీధిలో నీవున్నావని
నిశ్శబ్దంగా వెదికాను!
వెన్నెల వెలుగులలో కల్సి పోయావని
వెంపర్లాదుతూ వెదికాను!
కడలి అంచున నిల్చున్నావని
కాగడాలతో వెదికాను!
కొండ అంచున కూర్చున్నావని
గుండెను పల్లకీ చేసి పంపాను!

వికసించే పువ్వులలో ,వర్షించే మెఘాల్లో
మంచు కొండల్లో ,మనసున్న గుండెల్లో
ఎక్కడెక్కడో వెదికాను,నీవున్నావని!

నా కన్నీటిని కడవలతో మోసుకొని
నా గుండెల మంటలను బాటలుగా చేసుకుని
నా ప్రాణాలను పిడికిలితో పట్టుకుని
ఎక్కడకు వెళ్ళావు చెలీ!
నేనెక్కడని వెదకను సఖీ!!!!

నా కవితలు

  • నీవన్నది,నిజమైనది
  • నీ వున్నావని

నా బ్లాగు లిస్ట్‌

  • - ఎవరో నా ముక్కు దగ్గర వేలు పెట్టి చూశారు."ఇంకా ఊపిరి ఉంది" అని చెప్తున్నారు. వీళ్ళంతానా చావు కోసం ఎదురు చూస్తున్నారు.నన్ను త్వరగా రధం మీదకు ఎక్కించాలి. ఎవరో ...
    14 సంవత్సరాల క్రితం

నా గురించి

CHENNAI, TAMILNADU, India
జీవితంలో కష్టసుఖాల బరువు తెలుసు. ప్రేమానురాగాల మాధుర్యం తెలుసు. స్నేహవీచికలపులకింతలు అనుభవైకవేద్యం ఇక తెలియవలసిందెల్లా ఒకటే నా బ్లాగు మిత్రుల మనసు!